Telangana Cm Revanth | తెలంగాణ రైజింగ్కు బాసటగా నిలవండి
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
అభివ్రుద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఉందని కేంద్ర మంత్రి హామీ
Hyderabad : తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే 25 సంవత్సరాలల్లో సమున్నత స్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలువాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. ఈసందర్భంగా 2025 సంవత్సరంలో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్ను ప్రోత్సహించేందుకు మద్దతుగా ఇవ్వాలని కేంద్ర మంత్రి జైశంకర్ను సీఎం కోరారు. తెలంగాణ రైజింగ్ను విదేశాల్లో భారత్ కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కేంద్ర మంత్రి జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్లో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జైశంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, నాగర్ కర్నూలు, భువనగిరి లోక్సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
* * *