BRS Mlc Kavita | గ్రూప్ 1 అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలి
గ్రూప్- 2 ఫలితాలలో 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు నిలిపివేత
ట్రాన్స్ లేషన్ వల్లే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం
ఈ అనుమానాలకు రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ నివ్రుత్తి చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
Hyderabad : గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ ) నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రతినిధులు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈమేరకు గ్రూపు పరీక్షలలో తలెత్తున సమస్యల గురించి ఆమెతో చర్చించారు. ఈ నేపథ్యంతో తాము వ్యక్తం చేస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనిత్తాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, విద్యార్థులు తన దృష్టికి ఆ విషయాన్ని తీసుకు వచ్చారని తెలిపారు. ట్రాన్స్ లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సక్రమంగా మూల్యాంకనం చేయలేకపోయారన్నారు. అందుకే మార్కుల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ఆమె వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమినరీ పరీక్షలకు ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్ పరీక్షలకు మరొక హాల్ టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేయాల్సి వస్తుందని ఆమె దుయ్యబట్టారు. అలాగే.. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాల్లో తప్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఈ పరీక్ష ఫలితాలలో దాదాపు 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, ఈ ఫలితాలకు ఏ కారణంతో ఆ 13వేల మందిని ఇన్వాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ సత్య, గౌతమ్, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డా ఎల్చాల దత్తాత్రేయ, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్, మంథని మధు, కేయూ నుండి శరత్ గౌడ్, గ్రూప్ 1 అభ్యర్థులు సింధు రెడ్డి , అనూష, సత్యవతి, రవీందర్ రాథోడ్, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
* * *