MLC Kavita | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..
లేకుండా ఎన్నికలకు వెళ్తే.. గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తాం
సీఎం ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసినా… మోదీతో బీసీ బిల్లుపై మాట్లాడలేదు
జూలై 17న రైల్ రోకోకు అపూర్వ స్పందన… మద్ధతు ప్రకటిస్తున్న కుల సంఘాలు
జూలై 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోండి
బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు ?
చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి ఏం లాలూచి ఉంది ?
నల్లమల పులినని అని చెప్పుకునే సీఎం…ఏపీ జలదోపిడీ విషయంలో పేపర్ టైగర్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రతీ వార్డులో, పంచాయతీలో వందలాది నామినేషన్లు దాఖలు చేయిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సారి కూడా బీసీ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించకపోవడం దారుణమని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నీస్ రికార్డు నమోదు ఖాయమని ఎద్దేవా చేశారు. మనస్ఫూర్తిగా బీసీ బిల్లు ఆమోదానికి రేవంత్ రెడ్డి కృషి చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇక బీసీ బిల్లు కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బీజేపీ యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీ బిల్లుకు మద్ధతివ్వకుండా ఎన్ని యాత్రలు చేసినా బీజేపీని ప్రజలు నమ్మరని తెలిపారు.
బీసీ బిల్లు కోసం జూలై 17న పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… జూలై 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము పిలుపునిచ్చిన రైల్ రోకో కార్యక్రమానికి ఆయా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు వస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమానికి మద్దతిస్తున్నాయని వివరించారు.
గోదావరి జలాలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వృథా అవుతున్న గోదావరి నీటిని మన పొలాలకు మళ్లించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. అందుకే తుపాలకులగూడెం వద్ద నుంచి గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని కేసీఆర్ వాదించారని అన్నారు. దీని వల్ల తెలంగాణలోని సగం తెలంగాణ జిల్లాలకు గోదావరి నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందని వివరించారు. పోలవరం నుంచి లింకేజీ ప్రతిపాదనను గతంలోనే జగన్ తెస్తే కేసీఆర్ వ్యతిరేకించారని చెప్పారు.
చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తెలివిగా గోదావరి - కావేరి అనుసంధానమని చెప్పి 60 శాతం కేంద్రం నిధులతో ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నం చేస్తుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పా మన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు సాధించలేకపోతున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు ? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లాలూచి ఏమిటో చెప్పాలని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పీఎఫ్ఆర్ సమర్పించినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమని, తెలంగాణకు రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదని ఏపీ మంత్రి నిమ్మల రామా నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాశారని ఎండగట్టారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు సుప్రీం కోర్డులో కూడా పిటిషన్లు వేయించారని గుర్తు చేశారు. సుంకేసుల సామర్థ్యాన్ని పెంచుకున్న చంద్రబాబు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు తుమ్మిళ్ల పేరుతో చిన్న ఎత్తిపోతల పథకాన్ని చేపడితే అడుగడుగునా అడ్డు తగిలారని మండిపడ్డారు. నల్లమల పులిని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … ఏపీ జలదోపిడిని నివారించే విషయంలో పేపర్ టైగర్ గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.
గోదావరి – బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి వద్ద భారీ రిజర్వాయర్ నిర్మించి నల్లమల అడవిని ముంచేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ జాగృతి తరఫున న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. “ముఖ్యమంత్రికి సవాలు చేస్తున్నా… మీరు నిజంగా నల్లమల పులి బిడ్డ అయితే బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం డిమాండ్ చేయాలి” అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించకుండా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని ప్రజంటేషన్లు ఇచ్చినా బనకచర్ల ప్రాజెక్టు ఆగదన్నారు. నిజంగా ప్రాజెక్టును అడ్డుకోవాలంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం లొల్లి పెట్టాలని సూచించారు.
ఆపరేషన్ కగార్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఈ మారణకాండను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
* * *