Saturday, June 28, 2025

Brs Leader HarishRao | విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి

Brs Leader HarishRao | విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి
రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా?
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా ?
రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా?
రుణమాఫీ చారణ చేసి, బారాణ మందిని మోసం చేసినందుకా?
అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా?
1200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా?
కాంగ్రెస్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వ‌జం..
Hyderabad : స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి.. కేవ‌లం 12,000 కి పరిమితం చేయడం మోసం చేయడమే అవుతుంద‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఎక్స్ ఖాతా ద్వారా విమ‌ర్శించారు. గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమే అవుతుంద‌ని విమ‌ర్శించారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావ‌ని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచావ‌ని ఆరోపించారు.
* రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి?
రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా ? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి, బారాణ మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా? 1200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా? ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థ‌కం చేస్తున్నందుకా?
పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై.. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వనందుకా?
ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా జరపనందుకా? జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి, రైతులకు సకాలంలో అందించినందుకా? వరంగల్ రైతు డిక్లరేషన్ ను అటకెక్కించినందుకా? మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? ఎందుకు సంబురాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి? అని మాజ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్న‌ల జ‌డివాన కురిపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న.. నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నాడు మండిప‌డ్డారు. బిఆర్ఎస్ ది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వం ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, త‌మ‌రు మాత్రం ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న నీ జిమ్మిక్కులను రైతులు నమ్మర‌ని ఆరోపించారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పి.. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles