Saturday, June 28, 2025

Mlc Kavita-Post Card | కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను అడుగు చెప్తరు

Mlc Kavita-Post Card | కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను అడుగు చెప్తరు
*కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు
*చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చిందే నువ్వు
*అసెంబ్లీలో ఆరు గ్యారంటీలు, హామీల అమలుపై చర్చించే సత్తా ఉందా
*సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్
*మహిళలకు రూ.2,500 ఇవ్వాలని, పింఛన్లు పెంచాలని డిమాండ్
*కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి పోస్టు కార్డులు
Hyderabad : కేసీఆర్ దమ్మేంటో.. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ హామీ ఇచ్చినట్టుగా మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలన్న డిమాండ్‌తో.. బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీకి పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేశారు.
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి, ప్రజాభవన్ లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి, గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చిందే రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కలలో కూడా తెలంగాణకు కేసీఆర్ నష్టం చేయబోరని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి, ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చించే సత్తా ఉందా ? అని నిలదీశారు. గ్యారంటీలపై, మహిళలకు, పింఛన్లు పొందే అవ్వాతాతలకు చేసిన మోసంపై చర్చిద్దామా అన్నారు. 2016లో అసలు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనే ప్రస్తావనే లేదన్నారు. అబద్ధాలు ఆడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని దుయ్య‌బ‌ట్టారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తించి, హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించబోరని ఆమె పేర్కొన్నారు.
*పింఛన్లు పెంచాలని, మహిళలకు రూ.2,500 ఇవ్వాలి..
సోనియాగాంధీ గ‌త ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చి హామీలు ఇచ్చారు కాబట్టే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కవిత అన్నారు. సోనియాగాంధీ హామీ ఇచ్చినట్టుగా మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇతర పింఛన్ లబ్ధిదారులకు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేలా రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందుకోసమే సోనియాగాంధీకి వేలాది పోస్టు కార్డులు రాస్తున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిప‌డ్డారు. సోనియాగాంధీ సంతకం పెట్టిన గ్యారంటీ కార్డులను ఎన్నికలకు ముందు ఇంటింటికీ పంపి ప్రజలను మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు మహేందర్, సంపత్ గౌడ్, రూప్ సింగ్, అర్చనా సేనాపతి, లలిత యాదవ్, మనోజా గౌడ్, శోభ, లావణ్య, కవిత, పరమేశ్వరి, రజిత రెడ్డి, ఈగ సంతోష్, మనోజ్ గౌడ్, నరేందర్ యాదవ్, రాము యాదవ్, మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles