Monday, April 28, 2025

Telangana AI CITY | ఉగాది తర్వాత ఏఐ సిటీ కి భూమి పూజ

Telangana AI CITY | ఉగాది తర్వాత ఏఐ సిటీ కి భూమి పూజ
“క్లియ‌ర్ టెల్లిజెన్స్” ఇండియా డెలివ‌రీ అండ్ ఆప‌రేష‌న్స్ సెంట‌ర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
200 ఎక‌రాల‌లో ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో ఏఐ సిటీ నిర్మిస్తామ‌ని వెల్ల‌డి
Hyderabad : రాష్ట్రంలో ఉగాది పండుగ తర్వాత మహేశ్వరంలో “ఏఐ సిటీ (Artificial Intelligence)` నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్ లో శుక్రవారం “క్లియ‌ర్ టెల్లిజెన్స్” ఇండియా డెలివ‌రీ అండ్ ఆప‌రేష‌న్స్ సెంట‌ర్ ను మంత్రి శ్రీధ‌ర్ బాబు లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామన్నారు. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయ‌న్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ హబ్ గా మారుతుందన్నారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ప్రారంభించామని, త్వరలోనే “క్వాంటం కంప్యూటింగ్”లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయ‌న పేర్కొన్నారు.
టెక్నాలజీ అంటేనే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేయడమే తమ లక్ష్యమని ఆయ‌న అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా నిలుస్తామ‌ని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు ఎదిగితే.. రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుందన్నారు. ప్రతిభ గల యువతే తెలంగాణకున్న అతి పెద్ద ఆస్తి ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రోజు రోజుకీ మారుతున్న టెక్నాలజీ కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారాలను కనుక్కునేందుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడూ ముందుంటుందన్నారు. ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే “క్లియ‌ర్ టెల్లిజెన్స్” సంస్థ తమ ఇండియా శాఖను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో “క్లియ‌ర్ టెల్లిజెన్స్” సీఈవో ఓవెన్ ఫ్రివోడ్‌, మేనేజింగ్ పార్ట్ న‌ర్ అనిల్ భ‌రాడ్వా, డైరెక్టర్ మురళి త‌దిత‌రులు పాల్గొన్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles