Collectors In AC Rooms|అధికారుల ఆలోచనల్లో మార్పులు రావాలి
కలెక్టర్లు ఏసీ రూముల నుంచి బయటకు రావడం లేదు
అధికారుల తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేసిన సీఎం రేవంత్
లైఫ్ ఆఫ్ ఏ ఖర్మ యోగి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad | ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గోపాలకృష్ణ అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో `లైఫ్ ఆఫ్ ఏ ఖర్మ యోగి` పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమాజంలో ఏదైనా కొనవచ్చు.. కానీ అనుభవాన్ని మాత్రం కొనలేమని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్లకు ఈ పుస్తకం ఒక దిక్సూచిగా ఉంటుందని భావించారు. నాటి నుంచి నేటి వరకు దేశంలో వేగంగా జరిగిన మార్పులకు ఆయనే ప్రత్యక్ష సాక్షి అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాలని, వారిలో శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్ అని తెలిపారు. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ అని తెలిపారు. అలాగే పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ అని కొనియాడారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. వారి అనుభవాల నుంచి సివిల్ సర్వెసుల వారు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
గతంలో అధికారులు రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారన్నారు. కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయిందని కొంత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలని, గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారన్నారు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులను ఎక్కువ గుర్తుంచుకునేవారన్నారు. కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచే బయటకు వెళ్లడం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలని, నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని, అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువకాలం గుర్తుంటారని సూచించారు. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని తాను కోరుతున్నానని సీఎం రేవంత్ వివరించారు.
* * *