Neet Exams | మే 4న నీట్ పరీక్షలు
పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎస్
ఎల్ ఆర్ ఎస్ పైనా పురోగతి తెలుసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు
Hyderabad : మెడికల్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం మే 4న జరగనున్న నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్రానికి మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. మౌలిక సదుపాయాలు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. మంగళవారం డాబిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి నీట్ పరీక్ష ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వంటి ప్రభుత్వ భవనాలను వెంటనే గుర్తించి పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే భూ క్రమబద్ధీకరణ పథకం(LRS) పురోగతిని కూడా సీఎస్ సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించిన దరఖాస్తులకు రిబేట్ (రాయితీ)పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గతంలో నామమాత్రపు ఫీజులు చెల్లించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని కూడా పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు.
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ మహేశ్ భగవత్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేందర్, ఇతర అధికారులు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
* * *