CM Metro Rail | ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు
అధికారుల సమీక్షసమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయం
ఇప్పటికే కేంద్రతో కొనసాగిన సంప్రదింపులయని సీఎం ద్రుష్టికి తెచ్చిన అధికారులు
రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు రూ.24,269 కోట్లు అంచనా
కేంద్రం, రాష్ట్రం చెరి సగం నిధులు భరించాలని ప్రాథమిక నిర్ణయం
Hyderabad : హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్ – పటాన్చెరు (13.4 కి.మీ.), ఎల్బీ నగర్ – హయత్నగర్ (7.1 కి.మీ.) మొత్తం కలిపి 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.
కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్తగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట్ వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏ (HMDA)తో పాటు ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీ (FCDA) ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* * *