Cm Revanth reddy – Malabar Unite | ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహానికి స‌ర్కారు సిద్ధం

Cm Revanth reddy – Malabar Unite | ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహానికి స‌ర్కారు సిద్ధం
వారికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తాం..
హైద‌రాబాదు వ్యాపార న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం
రాబోయే ప‌దేండ్ల కోసం ప్ర‌ణాళిక‌లు త‌యారు చేస్తున్నాం
మ‌ల‌బార్ గ్రూపు వారి జెమ్స్ అండ్ జ్యువెల్ల‌రీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి..
Hyderabad : తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అన్నారు. గురువారం మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూపు స్థాపించిన జెమ్స్ అండ్ జ్యువెల్లరీ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని, ఈ మేర‌కు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం, రంగాల వారిగా పరిశ్రమలు రాణించడానికి సహకరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి తెలంగాణలో గత ప్రభుత్వాల నుంచే సానుకూల విధానాలు అమలులో ఉన్నాయని, వాటిని మరింత మెరుగైన విధానంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
“తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఒక వ్యాపార నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. మహేశ్వరం ప్రాంతంలో నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి అందించబోతున్నాం. 30 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అధునాతన నగరాన్ని నిర్మించబోతున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడే నైపుణ్యం ఇక్కడి యువతలో ఉంది. హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడగలదు. అందుకే ముంబయ్, బెంగుళూరు చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచ అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్దేశించాం.
రాబోవు వందేళ్ల వరకు రాష్ట్రానికి ఏమవసరమో భవిష్యత్ ప్రణాళికలతో రూపొందిస్తున్న తెంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే డిసెంబర్ 9 న ఆవిష్కరిస్తాం. అధునాతన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై సింగపూర్, ఇతర దేశాల కన్సల్టెంట్లు నిరంతరం పని చేస్తున్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ దేశంలోనే లెజెండ్‌గా నిలిచింది. దేశంలో 35 శాతం బల్క్ డ్రగ్ హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి ప్రాంతం నుంచి మలబార్ బంగారం యూనిట్ ప్రారంభించడంతో ఇక బంగారంలోనూ తెలంగాణ ప్రసిద్ధి చెందుతుంది. బంగారం వ్యాపారం మంచి పేరున్న మలబార్ గోల్డ్ తన యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకర పరిణామం. సరైన ప్రాంతంలో, సరైన రాష్ట్రంలో మలబార్ గోల్డ్ తన యూనిట్‌ను ప్రారంభించింది..” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
ఈ యూనిట్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ , మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్, వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version