KTR – CHIT CHAT | గడ్డం పెంచితే.. గబ్బర్‌సింగ్ కారు

  • KTR – CHIT CHAT | గడ్డం పెంచితే.. గబ్బర్‌సింగ్ కారు
  • డబ్బుల కోసమే జీహెచ్‌ఎంసీ విభజన
  • రేవంత్‌ పాలనను ప్రజలు తిరస్కరించారు
  • పాలమూరు రంగారెడ్డిని కావాలనే తొక్కిపెట్టిండు
  • ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తదని భయం
  • గడ్డాలు పెంచడం ఈజీ.. పాలన చేయడమే కష్టం
  • చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
Vikasamnews/Hyderabad : ముఖ్య‌మంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప‌రిపాలనను రాష్ట్ర‌ ప్రజలు తిరస్కరించారు అని, కాంగ్రెస్‌ సర్కారు రెండేండ్ల పాలనకు ఇటీవలి సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలే అందుకు రెఫరెండం అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్పంచ్ ఎన్నిక‌లో తమ పార్టీ గొప్ప ఫలితాలు సాధించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయ‌న పేర్కొన్నారు. బీఆర్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ ఇష్టాగోష్టిలో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
కేవలం డబ్బుల సేకరణ కోసం మర్చంట్‌ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్టు జీహెచ్‌ఎంసీని విభజిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతోనే, తన పాత బాస్‌ చంద్రబాబుకు కోపం వస్తుందనే రేవంత్‌రెడ్డి పక్కన పెట్టారని విమర్శించారు. తెలంగాణ సాధించిన ఉద్య‌మ‌ నేతగా కేసీఆర్‌ అంటే ప్రజలందరికీ ఎంతో గౌరవమని, అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం కలవడం మంచిదేనని అని ఆయ‌న అన్నారు. అయితే ఇదే సంస్కారాన్ని బయట కూడా కొనసాగించాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డం అంటే గడ్డం పెంచినంత ఈజీ కాదని, గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్‌సింగ్‌లు కాలేరని ఎద్దేవా చేశారు.
నీటి పారుదల సబ్జెక్ట్‌ చదివితే రాదు
కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తున్నారన్న మాట వినగానే కాంగ్రెస్‌ నాయకులు చర్చకు ప్రిపేర్‌ అవుతున్నారని, నీటి పారుదల శాఖ సబ్జెక్ట్‌ అనేది నాలుగు రోజులు చదివితే రాదని ఆ శాఖ మంత్రికి కేటీఆర్‌ చురకలంటించారు. కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌మీట్‌కే అల్లాడిపోతున్న కాంగ్రెస్‌ నేతలు.. మీడియా ముందు లేవనెత్తిన ప్రశ్నలకు చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తే ఈరోజు రాష్ట్ర నీటి పారుదలశాఖ సలహాదారుడిగా ఉన్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇలాంటి వారు శాఖపై చర్చ కోరుతున్నారని, అసలు దేనిపై చర్చ పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని, నీటిపారుదలపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్‌ చర్చకు రావాలని అంటున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే భయంతోనే..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతోనే, తన పాత బాస్‌ చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందన్న ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే చంద్రబాబుకు కోపం వస్తుందని, అందుకే ప్రాజెక్టును పండబెట్టి కాలువలు కూడా తవ్వడం లేదని ఆక్షేపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో 45 టీఎంసీలకు ఒప్పుకొంటే అది నష్టమే అవుతుందని, 299 టీఎంసీలకు ఒప్పుకొన్నది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దాని ఆధారంగానే తమ ప్రభుత్వం మరిన్ని నీటి కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరిందని కేటీఆర్‌ తెలిపారు.
ప్రజలకు నీళ్లు ఇచ్చింది ఎవరో బాగా తెలుసని కేటీఆర్‌ స్పష్టంచేశారు. కాలంతో పోటీపడి మరీ కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నాయకుడు కేసీఆర్‌ హయాంలోనే పూర్తయిందని, దీనికి కారణం కేసీఆర్‌ నిబద్ధతే అని పేర్కొన్నారు. కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందే తప్ప రాజకీయంగా తమకు నష్టం జరగదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం అయినా ముందుగా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం పరిపాటేనని తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు.
నెహ్రూకాలంలో నుంచే గూఢ‌చారి వ్య‌వ‌స్ధ‌..
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రమేయం ఉండదని, ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్‌ సమాచారం వస్తుందని, గూఢచారి వ్యవస్థ నెహ్రూ కాలం నుంచే కొనసాగుతున్నదని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ సర్కారు ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం లేదా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు, రాష్ట్ర రక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు నిఘా వ్యవస్థ లేదా ఫోన్‌ ట్యాపింగ్‌ లేదని ఎవరైనా అనగలరా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా? అని నిలదీశారు. ట్యాపింగ్‌ నిజం కాకపోతే అధికారులు ఎందుకు ఇప్పటివరకు ప్రెస్‌మీట్‌ పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
సిట్‌ విచారణతో ఏం సాధించారు?
సిట్‌ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎంతకాలం మళ్లిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ అటెన్షన్‌ డైవర్షన్‌తో ఎంతకాలం కాలం వెళ్లదీస్తారని నిలదీశారు. ఇన్ని సిట్‌లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటని ప్రశ్నించారు. అక్రమంగా ఆరు కేసులు పెట్టారని, కనీసం ఒక దాంట్లో అయినా నిజం ఉన్నదని తేలిందా? అని నిలదీశారు. ప్రజలు ఈ డైవర్షన్లను స్పష్టంగా గ్రహిస్తున్నారని, అందుకే సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని చెప్పారు. కాంగ్రెస్‌కు పరిపాలన రాదని ప్రజలు తేల్చిచెప్పారని, కాంగ్రెస్‌ అప్పుల ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదని స్పష్టంచేశారు. కాగ్‌ లెకలు, నిజాలు కూడా ప్రజలకు తెలుసని, 24నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమి చేసిందని, ఏం నిర్మించిందని ప్రశ్నించారు. ఇప్పుడున్న సచివాలయం, సీసీఎస్‌ కేసీఆర్‌ కట్టిన ఆనవాళ్లేనని వివరించారు. రేవంత్‌ సర్కారు నిర్మించిన ఆనవాళ్లు ఏం ఉన్నాయని నిలదీశారు. తెలంగాణ తల్లిని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు, కౌలు రైతులకు రూ.12వేలు ఇస్తే రాష్ట్రంలో సహకార ఎన్నికలు రేవంత్‌ సర్కారు ఎందుకు పెట్టడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు.
ఎవ‌రి బాంబులు పెట్టి పేల్చాలో తెలుసు..
మేడిగడ్డను ఎవరు బాంబులు పెట్టి పేల్చారనేది హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సభలోనే స్పష్టంగా చెప్పారని కేటీఆర్‌ గుర్తుచేశారు. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా సభ నడుపుతారని, కానీ సబ్జెక్ట్‌ లేనప్పుడు సభను ఎకువ రోజులు నడపలేరని వ్యాఖ్యానించారు. చెక్‌డ్యామ్‌ పేల్చివేత కేసులో రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రమేయం ఉన్నదని ఆరోపించారు. మేడిగడ్డ పేల్చారని ఇంజినీర్లు ఆనాడే ఫిర్యాదు చేశారని, అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. తీసుకున్న చర్యలు ఎకడున్నాయని నిలదీశారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో కాకువ డ్యామ్‌ పేల్చారని, అదే తరహాలో ఇకడ కూడా పేల్చారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ క్లుప్తంగా వివరించారని గుర్తుచేశారు.
గడ్డం ఉన్నోళ్లంతా గబ్బర్‌సింగ్‌లు కాలేరు
గడ్డం పెంచిన ప్రతి ఒకరూ గబ్బర్‌ సింగ్‌ కారని కేటీఆర్‌ చురకలంటించారు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ, రెండు రోజులు షేవింగ్‌ చేసుకోకపోతే అదే పెరుగుతుందని, కానీ పాలన చేయడమే చాలా కష్టమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయినా, రేవంత్‌రెడ్డి గడ్డం, మీసాలు లేవని అన్నది తనను కాదని, రాహుల్‌గాంధీని, రాజీవ్‌గాంధీని కూడా అన్నారని చెప్పారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పు అంటున్నారని, కానీ అల్లుడిని మాత్రం ఆంధ్రా నుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసినందునే ప్రజలు కాంగ్రెస్‌ పట్ల ఆగ్రహంగా ఉన్నారని గుర్తుచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కష్టపడి పార్టీ నేతల సహకారంతో భారీగా సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. బోథ్‌ నియోజకవర్గంలో 233 సర్పంచులకు గాను 131 సీట్లను గెలుచుకున్నామని తెలిపారు. ప్రచారానికి తాము వెళ్లకుండానే ఇన్ని సీట్లు సాధించామని కేటీఆర్‌ వివరించారు. జీహెచ్‌ఎంసీ విభజనపై చర్చ పెట్టాలని, చర్చలో తమ పార్టీ అన్ని విషయాలు మాట్లాడుతుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికీ లాభం చేకూర్చేలా చేసుకుంటారో వారి ఇష్టమని వ్యాఖ్యానించా రు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు చరిత్రాత్మకమని, అలాంటివి ఇప్పటివరకు చూడలేదని, మళ్లీ చూడబోమని తెలిపారు. గతంలో ఓల్డ్‌సిటీలో తమ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని, గతంలో తాము గెలిచిన సీట్లను భవిష్యత్తులో ఎవ్వ రూ గెలువలేరని ధీమా వ్యక్తం చేశారు.
* రాష్ట్రంపై ప్రేమ ఉండాలి..
నీటి పారుదల శాఖ సబ్జెక్ట్‌ అనేది నాలుగు రోజులు చదివితే రాదు. రాష్ట్రంపై ప్రేమ ఉండాలి. కృష్ణా నది ఏ బేసిన్‌లో ఉన్నదో? ఎక్కడ ఉన్నదో కూడా ముఖ్యమంత్రికి తెలియని పరిస్థితి ఉన్నది. భాక్రానంగల్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉన్నదో కూడా రేవంత్‌రెడ్డికి తెలియదు. నీళ్ల గురించి ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నరు. ఇరిగేషన్‌పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్‌ చర్చకు రావాలని అంటున్నరు. అసలు దేనిపై చర్చ పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. జీహెచ్‌ఎంసీని మూడు భాగాలు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఫోర్త్‌సిటీ అని పేరు పెట్టి దానిని కూడా కార్పొరేషన్‌ చేస్తారేమో. మర్చంట్‌ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్టు డీలిమిటేషన్‌ చేస్తున్నారు. కేవలం డబ్బుల కోసం అడ్డగోలుగా విభజన చేస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదు. అన్నింటికీ సమాధానం చెప్పాలి.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version