WOMENS DAY| మ‌హిళ‌లు అన్ని రంగాల‌ల్లో విజ‌యం సాధిస్తున్నారు

WOMENS DAY| మ‌హిళ‌లు అన్ని రంగాల‌ల్లో విజ‌యం సాధిస్తున్నారు
తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళల సమస్యలపై ప్రత్యేక బుక్‌లెట్ విడుదల చేస్తాం
మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డి..

Vikasamnews/ Hyderabad : మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో విజ‌యం సాధిస్తున్నారు అని మాజీ మంత్రి స‌బితాఇంద్రా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొని మహిళల సాధికారతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బుక్‌లెట్ తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టితో అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
క‌ల్యాణ‌ల‌క్ష్మీ, కేసీఆర్‌కిట్‌, మిష‌న్‌భ‌గీర‌థ (Kalyana Lakshmi Scheme, KCR Kit Scheme, Mission Bhagiratha) వంటి పథకాలు మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని పేర్కొన్నారు. మహిళలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మహిళలను నాయకుడిలా కాకుండా.. సొంత తండ్రిలా చూసుకున్నారని అన్నారు. మహిళలకు రక్షణతో పాటు పథకాల ద్వారా భరోసా కల్పించారని తెలిపారు. తాను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన మహిళల పాలిట స్వర్ణయుగంగా నిలిచిందన్నారు. మహిళల కోసం ఇంత విస్తృతమైన పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపించవని చెప్పారు. ఎమ్మెల్సీ సుర‌భివాణిదేవి మాట్లాడుతూ తన తండ్రి మాజీ ప్రధాని P. V. Narasimha Rao మహిళల పట్ల వివక్షను సహించేవారు కాదని గుర్తు చేశారు. అదే బాటలో కేసీఆర్ మహిళల రాజకీయ, ఆర్థిక సాధికారతకు కృషి చేశారని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే గొంగిడి మాట్లాడుతూ మహిళలకు పథకాల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను నిరాశపరిచిందని విమర్శించారు. మహిళలకు జరిగిన అన్యాయాలపై చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ‌ అధ్యక్షత వహించారు. మహిళల సాధికారత కోసం సమాజంలో ప్రతి రోజూ మహిళా దినోత్సవంలా పరిస్థితులు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో గాయని Madhu Priya, రేలారే గంగ పాటలు పాడి సభలో ఉత్సాహాన్ని నింపారు. అలాగే వివిధ రంగాల్లో రాణించిన విజయశ్రీ, లక్ష్మిరెడ్డి, మధులిక, శామూ తదితర మహిళలను బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version