Telangana Jagruthi – Kavita | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి
రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి కమీషన్లు మెక్కిండు
తెచ్చిన అప్పులు ఎందుకు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీయిస్తోంది
అప్పులు రీ పేమెంట్ చేయక డిఫాల్ట్ అయ్యే పరిస్థితిని తెచ్చింది
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు ఒప్పుకున్నదే రేవంత్ రెడ్డి
పూణే మెట్రోకు నిధులిచ్చి.. హైదరాబాద్ మెట్రోకు కేంద్రం మొండిచేయి చూపింది
ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలుండి ఏం లాభం
Hyderabad : రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస్తకం ప్రచురించి రాష్ట్రమంతా పంచుతామని తెలిపారు. గురువారం ఉదయం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక నాయకుడి కరప్షన్ పై పుస్తకం వేశారని.. రేవంత్ రెడ్డి.. అవినీతిలో చక్రవర్తి కాబట్టి ఆయన అవినీతిపై పుస్తకంలో సమగ్రంగా వివరిస్తామన్నారు. కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్ రెడ్డి కమీషన్లు మెక్కాడని ఆరోపించారు. కొత్తగా ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, పింఛన్లు పెంచకుండా, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా అప్పు తెచ్చిన రూ.2 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో క్రమశిక్షణతో లోన్లు రీ పేమెంట్ చేసి ఏ గ్రేడ్ రేటింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి డిఫాల్ట్ స్టేట్ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి తెచ్చిన లోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన సమయానికి తిరిగి చెల్లించడం లేదన్నారు. ఇన్ స్టాల్ మెంట్ల పేమెంట్ లో డిఫాల్ట్ స్టేజీకి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని.. అందుకు ఆర్ఈసీ రాసిన లేఖనే సాక్షమని అన్నారు. తాను ఆధారాలు లేకుండా ఒక్క మాట మాట్లాడనని.. పూర్తి ఆధారాలతోనే ఈ విషయాలు బయట పెడుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రతి మాటకు ముందు.. కేసీఆర్ చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికే అప్పులు చేస్తున్నామని చెప్తున్నారని.. ఆయన చెప్పేవన్ని శుద్ధ అబద్ధాలని ఆర్ఈసీ లేఖతో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించారని తెలిపారు. ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తెచ్చిన అప్పులను క్రమం తప్పకుండా రీ పేమెంట్ చేశారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఈసీకి చెల్లించాల్సిన రూ.1,320 కోట్లను ఈనెల 28వ తేదీలోపు చెల్లించాలని లేఖ రాసిందని.. సమయానికి రీపేమెంట్ చేయకపోతే దివాళాగా పరిగణించాల్సి వస్తుందని కూడా హెచ్చరించిందని అన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ.. ఏ ఒక్క కాంట్రాక్టర్ కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ల సంస్కృతి మొదలైందని ఆమె మండిపడ్డారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అనే ప్రాజెక్టు కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు రూ.600 కోట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు మరో రూ.600 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. చెంచా మట్టి కూడా తీయకుండా ఒక్క ప్రాజెక్టుకే రూ.1,200 కోట్ల ముందస్తు చెల్లింపులు చేయడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
2024 జూలై 6వ తేదీన ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాతే చంద్రబాబు నాయుడు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని అన్నారు. 2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్ అనే ప్రాజెక్టు ప్రస్తావనే లేదన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంతో కేసీఆర్ పై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు లేదని ఆంధ్రా మేధావులు సైతం చెప్తున్నారని.. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు లాభం చేయడానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా పోలవరం – బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయడం లేదన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్ గా ఇచ్చారని అన్నారు. ఆంధ్రా బిర్యానీ ఎట్లా ఉంటుందో గతంలోనే కేసీఆర్ చెప్పారని అన్నారు.
పోలవరం ముంపు సమస్యను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి ఎజెండాలో చేర్చి చివరి నిమిషంలో చర్చను ఎత్తివేసిందని మండిపడ్డారు. భద్రాచల రాముడు పోలవరంలో మునుగుతున్నా.. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పూణే మెట్రో రైల్ కు కేంద్ర కేబినెట్ లో రూ.3,500 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు నిధులు తెచ్చే సత్తా లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
* * *