Brs Mlc Kavita | 16 నెలల పాలనలో.. 16 పనులు చేయలేదు

Brs Mlc Kavita | 16 నెలల పాలనలో.. 16 పనులు చేయలేదు
కాంగ్రెస్ నాయకులరా.. మీ మోసపు నైజం ప్రజలకు తెలిసింది
తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే
రజతోత్సవ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరండి
ఎల్కతుర్తి లోని బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

Hyderabad : కాంగ్రెస్ పార్టీది చేతగాని ప్రభుత్వమని తేటతెల్లమైందని, రాష్ట్రంలో 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం కనీసం 16 పనులు కూడా చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వ‌జ‌మెత్తారు. “కాంగ్రెస్ నాయకులరా… ఖబడ్దార్ ! మీ మోసపు నైజం ప్రజలకు తెలిసిపోయింది” అని ఆమె హెచ్చరించారు. ఎల్కతుర్తి లో ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారని, కానీ ఓట్లు బాగా రావాలని కోరునేది కాంగ్రెస్, బీజేపీ నాయకులు అని విమ‌ర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తాయనీ అన్నారు.
రజతోత్సవం ఎందుకు చేసుకుంటున్నారని కొంత మంది వెకిలి మాటలు మాట్లాడుతున్నారనీ తప్పు పట్టారు. “దేశానికే సేవలు అందించడానికి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామ‌ని, పరిణితి చెందడం ప్రకృతి ధర్మం అని, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజల కోరుకున్న రెవల్యూషన్ అని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుబోమ‌ని, కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి` అని హెచ్చరించారు. ఓర్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించరని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలుపెట్టారని, ఆ స‌మ‌యంలో కూడా ఉత్పన్నమైన అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఒక రక్తం చుక్క చిందించకుండా రాష్ట్రం సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గుండె ధైర్యంతో బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణను కాపాడుతూ వచ్చారన్నారు. తెలంగాణ ఉట్టిగానే రాలేద‌ని, కేసీఆర్ మేధస్సును కరిగిస్తే వచ్చిందని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలను చేధించి తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టారని క‌విత‌ పేర్కొన్నారు.
* కుంభ‌మేళ త‌ర‌హాలో ర‌జ‌తోత్స‌వం..
కుంభమేళ తరహాలో జరగబోయే ఈ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ నవయువకుల కోసం రజతోత్సవ సభ జరుగుతుందని, సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానిస్తున్నా మ‌ని తెలిపారు. మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని, మున్సిపాలిటీల్లో, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కోసం ప్రతీ జిల్లాలో హాస్టల్ తో కూడి డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలు భారీ ఎత్తున సభకు తరలిరావాలని ఆమె కోరారు.
రైతులు గుండెలపై చేయి వేసుకొని పడుకునే పరిస్థితిని కేసీఆర్ సృష్టించారనీ, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి లక్షలాది ఎకరాలు ఎండిపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంతా గులాబీ దండులా రజతోత్సవ సభకు కదలిరావాలని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ నయవంచన చేయని వర్గమే లేదని, 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, 1400 మంది బలిదానాలు చేసుకుంటే పదేళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిందనీ చెప్పారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version