Telangana Dycm Bhatti Vikramarka | ప్రాధాన్యత క్రమంలో బ‌కాయిలు చెల్లింపు

Telangana Dycm Bhatti Vikramarka | ప్రాధాన్యత క్రమంలో బ‌కాయిలు చెల్లింపు
ఏప్రిల్ నుంచి చెల్లింపు ప్రారంభం
రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్
బకాయిల కోసం ఉద్యోగులు తిరుగాల్సిన ప‌ని లేదు
ఉద్యోగుల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hyderabad : రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన పాత బ‌కాయిల‌ను ప్రాధాన్య‌త క్ర‌మంలో చెల్లిస్తామ‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. బిల్లుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదన్నారు. ఏప్రిల్ నుంచి చెల్లింపు ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌న్నారు. ఇప్ప‌టికే రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన‌ట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అర్థం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లిందని, గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని వివరించారు. పాత, కొత్త పెండింగ్ బిల్స్ రూ. 10,000 కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. మరో ఎనిమిది వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయి అని వివరించారు. ఏప్రిల్ నుంచి ఎలాంటి బకాయిలు లేకుండా చూస్తామని, అలాగేఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ.8,000 కోట్ల పాత బకాయిలు ఉన్నాయ‌న్నారు.
రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల 500 నుంచి 600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఉండేదని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల క్రమం తప్పకుండా ఒకటో తేదీన‌ జీత భత్యాలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది (ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్) సిబ్బంది ఉన్నారని తెలిపారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర బిల్లును మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తామ‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అర్ధికేతర సమస్యలు పరిష్కరించడానికి వివిధ క్యాబినెట్ సభ్యులం ఉన్నామ‌ని, ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్, వైద్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version